బంగ్లాదేశ్ను 15 ఏళ్లపాటు పాలించిన షేక్ హసీనాకు ఇది అతిపెద్ద ఎదురుదెబ్బ. 2024 జూలై-ఆగస్టు నెలల్లో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక విద్యార్థి ఉద్యమాన్ని అణిచివేసేందుకు హసీనా ప్రభుత్వం అత్యంత క్రూరంగా వ్యవహరించిందని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. ఈ హింసాత్మక అణచివేతకు హసీనానే “మాస్టర్మైండ్” అని కోర్టు తేల్చింది.
నిరసనకారులపై కాల్పులు జరపాలని, డ్రోన్లు మరియు హెలికాప్టర్లను సైతం ఉపయోగించాలని హసీనా స్వయంగా ఆదేశాలు ఇచ్చారని ప్రాసిక్యూషన్ రుజువు చేసింది. ఈ అల్లర్లలో సుమారు 1,400 మంది మరణించినట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పౌరులపై అమానవీయంగా దాడులు చేయించారని కోర్టు పేర్కొంది. ‘చేసిన పాపం పోక తప్పదు’ అన్నట్లుగా, ఆమె చర్యలకు ఇప్పుడు ఈ తీర్పు రూపంలో మూల్యం చెల్లించాల్సి వచ్చింది.
ఈ కేసులో హసీనాతో పాటు, అప్పటి హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్కు కూడా ట్రిబ్యునల్ మరణ శిక్ష విధించింది. అయితే, ఇదే కేసులో నిందితుడిగా ఉన్న మాజీ పోలీస్ చీఫ్ అబ్దుల్లా అల్-మామున్, ప్రభుత్వ సాక్షిగా (అప్రూవర్గా) మారారు. అతను నేరాన్ని అంగీకరించి, విచారణకు సహకరించినందున, కోర్టు అతనికి ఐదేళ్ల జైలు శిక్షతో సరిపెట్టింది.
ఆగస్టు 5, 2024న విద్యార్థుల ఉద్యమం ఉధృతం కావడంతో షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి, దేశం విడిచి పారిపోయారు. అప్పటి నుండి ఆమె పొరుగు దేశమైన భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ తీర్పును ‘కంగారూ కోర్ట్’ తీర్పుగా హసీనా పార్టీ అవామీ లీగ్ ఖండించింది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని ఆరోపించింది.
ఈ సంచలన తీర్పు నేపథ్యంలో బంగ్లాదేశ్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రస్తుత మధ్యంతర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. రాజధాని ఢాకాలో “షూట్ ఎట్ సైట్” (కనిపిస్తే కాల్చివేత) ఆదేశాలు జారీ చేశారు. ఈ తీర్పుతో, హసీనాను భారత్ నుండి రప్పించేందుకు (ఎక్స్ట్రాడిషన్) బంగ్లా ప్రభుత్వంపై ఒత్తిడి పెరగనుంది.

